అచ్యుత దేవ రాయలు
వికీపీడియా నుండి
అచ్యుత దేవ రాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఈయన 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.
శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు.
విషయ సూచిక |
[మార్చు] పట్టాభిషేకము
ఈయన మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు.
- మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు, ఈ విషయముపై కొద్దిగా విమర్శలు వచ్చినాయి, ఎందుకంటే గర్బగుడిలోనికి బ్రాహ్మణులు తప్ప అన్యులకు ప్రవేశములేదు.
- తరువాత అక్టోబరు 10 , 1529 న శ్రీ కాళహస్తి నందు రెండవపర్యాయము పట్టాభిషెకము జరుపుకున్నాడు
- తరువాత నవంబరు 20 , 1529న విజయనగరంన ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.
[మార్చు] యుద్దములు
అచ్యుతరాయలు రాజ్యము చేపట్టే నాటికి వారసత్వ పోరువళ్ల విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థుతలను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టినాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టినాడు. ఇతను అనేక యుద్దములందు విజయం సాధించినాడు.
శత్రు దండయాత్ర ప్రమాదం గుర్తించి అచ్యుతరాయలు, రామరాయలతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక ఉమ్మత్తూరు మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు అయితే అచ్యుతరాయల బావామరుదులైన సలకం పెద తిరుమలరాజు, సలకం చిన తిరుమరాజులు తిరుగుబాటును అణచివేసి వేసి శాంతిని నెలకొల్పినారు.
బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్షా కోయిలకొండ దగ్గర కులీ కుత్బుల్ ముల్క్ తో జరిగిన యుద్ధములో మరణించగా ఆయన కొడుకు మల్లూ ఆదిల్షా రాజ్యాన్ని చేపట్టాడు. ఈయన పాలన నచ్చని ప్రజలు అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వములో తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా 1535లో అచ్యుతరాయలు దండెత్తి రాయచూరు అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు.
[మార్చు] రామరాయల కుట్రలు
రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగ సాగింది. రామరాయలు తమ్ములు వెంకటాద్రి, తిరుమలులు అండగా ఉన్నారు. కందనవోలు, అనంతపూరు, ఆలూరు, అవుకు దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్షాను తొలగించి ఇబ్రహీం ఆదిల్షా గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులని రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.
1536లో గుత్తి ప్రాంతములోని తిరుగుబాటును అణచి రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. ప్రజలకు, సామంతులకు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించుట ఇష్టం లేదు. మధుర, కొచ్చిన్ ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి అచ్యుతరాయల్ని బందీ నుండి విడిపించి సింహాసనముపై పునరుద్ధరించారు.
రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబ్రహీం ఆదిల్షా నాగలపురాన్ని నేలమట్టం చేసి రాజధాన్ని సమీపించాడు. ఆదిల్షా ప్రతిపక్షములో చేరతాడన్న భయముతో అచ్యుతరాయలు కానీ రామరాయలు కానీ ఆదిల్షాను ప్రతిఘటించలేదు. ఇద్దరూ ఆదిల్షా సహాయము అర్ధించి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతలో బీజాపూరులో ఆదిల్షా పై అసద్ ఖాన్ లారీ మొదలైన ఉద్యోగులు కుట్రలు ప్రారంభించారు. పరిస్థితి గమనించి అచ్యుత, రామరాయల మధ్య సమాధానం కుదిర్చి బీజాపూర్ తిరిగి వెళ్ళాడు.
[మార్చు] చివరి రోజులు
రామరాయలతో ఒప్పందం అయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్యవ్యవహారాలను బావామరిది సలకం పెద తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురములోనే గడిపినట్లు, దానితో ప్రభుత్వం నీరసించినట్లు తెలుస్తున్నది. ప్రజాభిమానము కోల్పోయి అచ్యుతరాయలు 1542లో మరణించాడు.
[మార్చు] వ్యక్తిత్వము
నూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యము యొక్క గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన మరియు సాహిత్య ఆధారాలు లభించాయి[1]. కృష్ణదేవరాయలు ఈయన్ను తన వారసునిగా సమర్ధుడనే ఎన్నుకున్నాడు. అచ్యుతరాయల యొక్క జీవితము మరియు పాలనను రెండు సంస్కృత కావ్యాలు, రెండవ రాజనాథ డిండిమ రాసిన అచ్యుతాభ్యుదయం మరియు అచ్యుతరాయల భార్య తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయం వివరముగా వర్ణిస్తాయి[2].
[మార్చు] కళాపోషణ
ఈయన పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించినాడు. ఈ ఆలయములో నెలవున్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధం అయినది.
అచ్యుతరాయలు తిరుమలలోని ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన చక్రతీర్ధం లేదా ఆళ్వార్ తీర్ధాన్ని నిర్మింపజేశాడు. ఈయన తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1533 లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిని పక్కనే కొత్త పుష్కరినిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు[3].
కృష్ణదేవరాయలు లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్యాన్ని పోషించాడు. ఈయన ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు[4]. అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు మరియు సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. డిండిమభట్టు అచ్యుతరాయాభ్యుదయము తో పాటూ సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు.
అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తున్ని చేసేవరకు వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి[5]. ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు[2]. ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె మారిచీపరిణయం వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీకూడా చెప్పుకొంటారు[5].
అచ్యుత రాయలు స్వయంగా మంచి వీణా విద్వాంసుడు కూడా. ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ అచ్యుతభూపాళీ వీణ గా పేరొందినది[6].
[మార్చు] మూలాలు
- ↑ ది నాయక్స్ ఆఫ్ టంజావురు - వి.వ్రిద్ధగిరీషన్, చిదంబరం శ్రీనివాసాచారి పేజీ.15
- ↑ 2.0 2.1 వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)
- ↑ అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి
- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం (ఏడవ సంపుటం, మలిరాయల యుగం) - ఆరుద్ర పేజీ.237,238
- ↑ 5.0 5.1 సమగ్ర ఆంధ్ర సాహిత్యం (ఏడవ సంపుటం, మలిరాయల యుగం) - ఆరుద్ర పేజీ.14,15
- ↑ http://www.veenavidhya.com/veena.shtml
- ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు
- హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, ఫ్రం ప్రీహిస్టోరిక్ టైంస్ టు ఫాల్ ఆఫ్ విజయనగర్ - కె.ఏ. నీలకంఠ శాస్త్రి
[మార్చు] బయటి లింకులు
- అచ్యుత రాయలు జారీ చేసిన నాణేలు, ఇంకా కొన్ని
- అచ్యుతరాయ ఆలయము చిత్రాలు
- అచ్యుతరాయ ఆలయము గురించి మరింత సమాచారము
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: శ్రీ కృష్ణదేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1529 — 1542 |
తరువాత వచ్చినవారు: సదాశివ రాయలు |