ఔరంగజేబు
వికీపీడియా నుండి
ఔరంగజేబు ఆఖరి గొప్ప మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది. ఔరంగజేబును ఆలంగిర్ ("ప్రపంచాధినేత") అని కూడ పిలుస్తారు. అతని ముందు వచ్చిన ముఘల్ చక్రవర్తులు సాధరణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాలలో ఒక భాగం చేసారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండీ కాపాడుకున్నారు. వారికి విరుధ్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
ఔరంగజేబు గొప్ప దైవ భక్తుడు. మతాచారాలను తు.చ. తప్పకుండ పాటించేవాడు. భారత దేశానికి తను చక్రవర్తి ఐనా, తన స్వంత ఖర్చులు (తిండి బట్టలు సైతం) కేవలం తను టొపీలు కుట్టి సంపాదించిన డబ్బులతొటే పెట్టేవాడని చెప్పుకుంటారు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లిములు కాని వారిపై జిజియా పన్ను విధించాడు. ఈ పన్ను ఇస్లాం మత శాస్త్రాలలో రాసి ఉన్నప్పటికీ అతని పూర్వీకులు తెలివగా ఆ పన్ను వసూలు చెయ్యలేదు. ఔరంగజేబు మాత్రం ఈ మత సిద్ధాంతాన్ని ఉన్నదున్నట్టుగా పాటించి ముఘల్ సామ్రాజ్య అంతిమ పతనానికి కారకుడైయ్యడు.
ఔరంగజేబు అతని జీవిత కాలంలో గొప్ప భాగం దక్షిణాపథంలో గడిపాడు. అతని 48 సంవత్సరాల పరిపాలనలో ముఘల్ సామ్రాజ్యం దక్షిణాన కర్ణాటక, తమిళనాడుల వరకు విస్తరించింది. అదే సమయంలో ఛత్రపతి శివాజీ నేత్రుత్వంలో మరాఠాలు ముఘల్ ఆధిపత్యానికి గండి కొట్టదం ప్రారంభించారు.
షాజహాన్ మరియు ముంతాజ్ బేగంల మూడవ కొడుకు గుజరాత్ రాష్ట్రం లో దాహోడ్ నగరంలో 1618 నవంబరు 3న పుట్టాడు. పూర్తి పేరు: అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగ్జేబ్ ఆలంగిర్. తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్లో యుధ్ధాలు చేస్తూ గదిపిన ఔరంగజేబు 1707 మార్చి 3న మరణించాడు. ఆతని సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామంలో వుంది.